తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ స్కీమ్: బేసిక్ పే నుంచి 1.5% కటింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో ప్రభుత్వం నూతన హెల్త్ స్కీమ్ను అమలులోకి తెచ్చింది. ఇందుకోసం ప్రత్యేకంగా ‘ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్’ (EHCT) ను ఏర్పాటు చేస్తూ జూన్ 29, 2026న ఆర్థిక శాఖ (TFR) జీవో నెం.79 (G.O.MS.No.79) జారీ చేసింది. ఈ నూతన విధానానికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం మరియు అప్డేట్స్ కొరకు మీరు NEHS (New Employee Health Scheme) Telangana అధికారిక హోమ్పేజీని సందర్శించవచ్చు.
బేసిక్ పే నుంచి 1.5 శాతం డిడక్షన్
ఈ కొత్త నిబంధనల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పే (Basic Pay) మరియు పెన్షనర్ల బేసిక్ పెన్షన్ నుంచి ప్రతి నెలా 1.5 శాతం మేర నిధులను హెల్త్ స్కీమ్ ఫండ్ కోసం కట్ చేస్తారు. ఉద్యోగుల వాటాకు సమానంగా (Matching Contribution) ప్రభుత్వం కూడా తన వాటాను ఈ ఆరోగ్య ట్రస్ట్కు జమ చేస్తుంది. 2026 మే నెల నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది (అంటే జూన్ నెలలో చెల్లించే జీతాల నుంచి ఈ కటింగ్ ప్రారంభమైంది). ఈ పథకం ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు మరియు అర్హులైన ఆధారిత వ్యక్తులకు కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సేవలు అందుతాయి.
భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే ఒకరికే కోత
ఈ పథకంలో ఒకే కుటుంబానికి చెందిన ఉద్యోగులకు ప్రభుత్వం ఒక వెసులుబాటు కల్పించింది. భార్యాభర్తలు ఇద్దరూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు అయినట్లయితే, లేదా ఒక వ్యక్తి సర్వీస్ పెన్షన్ తో పాటు ఫ్యామిలీ పెన్షన్ తీసుకుంటుంటే.. వారిలో కేవలం ఒకరి నుంచి మాత్రమే ఈ 1.5 శాతం చందాను కట్ చేస్తారు. డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (DDOs) తగిన ఆధారాలతో IFMIS-HRMS సిస్టమ్లో స్పౌజ్ (Spouse) వివరాలను నమోదు చేసి, డబుల్ డిడక్షన్ జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ ఇప్పటికే ఇద్దరి అకౌంట్ల నుంచి పొరపాటున డబ్బులు కట్ అయ్యుంటే, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి రీఫండ్ చేస్తారు.